పంబ: శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయాన్ని ఇవాళే తెరవడంతో పెద్ద ఎత్తున మహిళా భక్తులు కూడా దర్శనం కోసం తరలి వస్తున్నారు. వాళ్లను అడ్డుకోవడానికి పంబ దగ్గర ఆందోళన కారులు ప్రయత్నిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించినా.. మహిళా భక్తులను అయ్యప్ప సన్నిధికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకుంటూనే ఉన్నారు. పంబ దగ్గరే వాహనాలను ఆపేసి అందులో పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఉంటే వాళ్లను వెనక్కి పంపించేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళలను కూడా కొండపైకి వెళ్లకుండా అడ్డుకొని వెనక్కి పంపించారు. కొందరైతే మహిళలు ఉన్న వాహనాలపై రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ రాళ్లు విసిరిన ఘటనలో ఎవరూ గాయపడకపోయినా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అయితే మహిళా భక్తులను అడ్డుకుంటామని కొన్ని రోజుల ముందు నుంచే ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరినా.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రీవ్యూ పిటిషన్ వేయబోమని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టంచేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు