రాజంపేటలో బుధవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ప్రజలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళితే.. రాజంపేట మండలం గుండ్లూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బహుదానది వద్ద ఉన్న సాయిబాబా ఆలయం వైపు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా లారీ దూసుకొచ్చింది. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఆలయం మెట్లపై లారీ ఎక్కేసింది. ఈ ఘటనలో లారీ నుంచి తప్పించుకునే క్రమంలో పలువురు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ బలంగా ఢీకొట్టడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలం నుంచి డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.