పుణె : స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేర గుజరాత్లోని నర్మదా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం కాళ్ల వద్ద ఆయన 1948లో ఒక సంస్థపై నిషేధం విధిస్తూ పటేల్ జారీ చేసిన ఆదేశాలను లిఖించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆరెస్సెస్ పేరు ప్రస్తావించకుండా ఆ సంస్థను నిషేధించాలని పటేల్ జారీ చేసిన ఆదేశాలను పటేల్ విగ్రహం కింద లిఖించాలని కోరారు. భారత తొలి హోం శాఖ మంత్రికి ‘వారి’ (ఆరెస్సెస్) పై ఉన్న అభిప్రాయమేమిటో ప్రజలకు తెలుస్తుందని ఆనంద్శర్మ అన్నారు. వారికి (బిజెపి, ఆరెస్సెస్) తమ స్వంత హీరోలు లేరని, అందుకే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేర పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఆ విగ్రహం కూడా చైనాలో తయారైందని శర్మ చెప్పారు. మహాత్మాగాంధీ హత్యానంతరం 1948లో పటేల్ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారని శర్మ చెప్పారు. దానిని యధాతథంగా ఆ విగ్రహం వద్ద లిఖించాలని ఆయన అన్నారు.