టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇటీవల టీడీపీ తీసుకువచ్చిన భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు చేయడంపై చంద్రబాబు స్పందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు మేనిఫెస్టోను కాపీ కొట్టారని, కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ లను చూసి బిసిబేళా బాత్ వండేశారని, అది రుచిగా ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో, ఏపీలో వైసీపీ పథకాలు కాపీ కొట్టేసి పులిహోర కూడా వండేశారని వ్యంగ్యం ప్రదర్శించారు.
జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఇవాళ్టి ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు అని స్పష్టం చేశారు. "సీఎం ఇంకో మాట కూడా అన్నాడు... ఈయన (చంద్రబాబు) రూ.2000 నోటు రద్దు చేయమన్నాడట... ఇలాంటి ఐడియాలు నాకెందుకు రావు అన్నాడు.
నీకెందుకు వస్తాయి అలాంటి ఆలోచనలు? ఆ రూ.2000 నోట్లు ప్రింట్ చేసి దొంగిలించడం నీకు అలవాటు. రూ.2 వేల నోటు రద్దు చేసి అవినీతిని నిర్మూలించాలన్నది టీడీపీ సిద్ధాంతం. అందుకే మాకు అలాంటి ఆలోచనలు వస్తాయి. మేనిఫెస్టో రూపకల్పనలో మేం కర్ణాటకలో రెండు పార్టీలను చూశాం అంట. ఇక్కడో అందమైన పోలిక కూడా చెప్పాడు. బిసిబేళా బాత్, పులిహోర కలిపేశామన్నాడు. ఆ రెండు కలిస్తే మంచిదే కదా. బిసిబేళా బాత్ పౌష్టికాహారం, పులిహోర రుచిగా ఉంటుంది. మేం రూపొందించిన మేనిఫెస్టో బెస్ట్ అని తను చెప్పకనే చెప్పాడు. రాసింది ఎవడో కానీ... జగన్ తోనే బెస్ట్ అని చెప్పించాడు. రాసిన వాడికి కూడా ఆ విషయం తెలిసుండదు. తెలిస్తే మాత్రం, నువ్వెలా రాసిచ్చావురా ఇది అని వాడ్ని లేపేస్తాడేమో! జగన్ ఏమన్నాడో మీడియా వాళ్లు కూడా ఓసారి చూడండి... బ్యూటిఫుల్ మేనిఫెస్టో ఇచ్చామని ఒప్పుకున్నాడు... అదీ సంగతి" అని చంద్రబాబు వివరించారు.