ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 08:04 PM

ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. నేడు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ఆ మండలంలో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నేడు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు.


రేపు 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో సాధారణ వడగాల్పుల వీస్తాయని తెలిపింది. ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వడగాల్పులతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేసింది. ప్రజలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శీతల పానియాలు తీసుకోవాలని సూచించింది. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. నిన్న బాపట్లలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్టం 27.7, కాకినాడలో గరిష్టం 38.4, కనిష్టం 27.8, కావలిలో గరిష్టం 39, కనిష్టం 29.4, మచిలీపట్నంలో గరిష్టం 37.7, కనిష్టం 27.9, నందిగామలో గరిష్టం 39.7, కనిష్టం 28.2, నర్సాపూర్‌లో గరిష్టం 36.6, కనిష్టం 28.2, నెల్లూరులో గరిస్టం 39, కనిష్టం 29.5, ఒంగోలులో గరిష్టం 37.7, కనిష్టం 28.6, తునిలో గరిష్టం 38, కనిష్టం 28.4, గన్నవరంలో గరిష్టం 38.4, కనిష్టం 28.2, విశాఖపట్నంలో గరిష్టం 37.2, కనిష్టం 28.6 డిగ్రీలు నమోదైంది.  ఇక అనంతపురంలో గరిష్టం 40.6, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీలు నమోదవ్వగా.. కడపలో గరిష్టం 38.2, కనిష్టం 28.6, కర్నూలులో గరిష్టం 40.6, కనిస్టం 30.1, తిరుపతిలో గరిష్టం 39, కనిష్టం 28.2 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com