ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే మేనిఫెస్టోని తెలంగాణలో కాఫి కొడతారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 07:15 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని ఆయన దుయ్యబట్టారు. రేపు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను కూడా టీడీపీ కాపీ కొడుతుందని ఎద్దేవా చేశారు. ఈ దసరాకు టీడీపీ ప్రకటించబోయే మేనిఫెస్టో తెలంగాణ ఎన్నికల్లో కాపీ కొట్టేదే అవుతుందని జోస్యం చెప్పారు.


2014 ఎన్నికల్లో 640 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక దాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ‘ఆల్ ఫ్రీ బాబు’ అనేవారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు.. ‘ఫుల్ ఫ్రీ బాబు’ అవుతారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తోందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సీఎం జగన్ పాలనపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లుగా సమర్థవంతమైన పాలన అందించారని పేర్కొన్నారు. అందుకే ‘జయహో జగనన్న’ అని ప్రతి ఒక్కరి నుంచి అనిపించుకుంటున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. గత నాలుగేళ్లలో రాజమండ్రి నగరాన్ని నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరెంతగానో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


రాజమండ్రిలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి.. తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి.. కుర్చీని, పార్టీని చివరికి బ్యాంకు అకౌంట్లు కూడా లాక్కుని మానసికంగా, శారీరకంగా హింసించి వేధించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ మా దేవుడంటూ ఆయన విగ్రహాలకు దండలు, శతజయంతులు నిర్వహించి.. ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారని విరుచుకుపడ్డారు.


ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు అంటే అదొక పెద్ద పండుగలా అందరూ భావించే వారని, కానీ ఇప్పుడు చంద్రబాబు నిర్వహించే మహానాడు రాజకీయ స్వార్థం, వసూళ్ల కోసం అన్నట్లుగా మారిందని మార్గాని భరత్ దుయ్యబట్టారు. మొన్న జరిగిన మహానాడుకు రాజమండ్రి నుంచి కనీసం 10 వేల మంది కూడా హాజరు కాలేదంటే.. ఆ పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. తమని, తమ పార్టీని మనస్ఫూర్తిగా అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు.. ప్రజల వద్దకు ర్యాలీగా బయల్దేరి వెళుతున్నామని, వారితో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటామని‌ చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com