ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించింది: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 07:14 PM

తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని తాను కోరుకుంటానని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తాము ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని.. 1991లో ఆయన ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారన్నారు. అలాంటి వ్యక్తి తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు.


నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించామని చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పామని.. సంస్కరణలకు సాంకేతిక జోడించి ముందుకు వెళ్లామని వివరించారు. విభజన జరిగిన తర్వాత పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశామని.. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషిచేసినట్లు వివరించారు. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ముందుకెళ్లామని పేర్కొన్నారు. విభజన వేళ ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని.. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉందన్నారు. అయినా కూడా సవాళ్లను అధిగమించి 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని గుర్తు చేశారు. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.


నదులను అనుసంధానిస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే వీలు కలుగుతుందని భావించామని చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును తాము 72 శాతం పూర్తి చేశామని.. కానీ, 2025కి ఫేజ్‌-1 పూర్తి చేస్తామని సిగ్గు లేకుండా వైకాపా ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తును అడ్డుకునే పరిస్థితికొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పోలవరం పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు.


ఇక, ఆనాడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనమే నెంబర్‌ వన్‌గా నిలిచామని.. 2015లో రెండో స్థానంలో ఉండగా.. 2016, 2017, 2018, 2019 తర్వాత కూడా అగ్రస్థానంలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఎఫ్‌డీఏలో రాష్ట్రం అథమ స్థానంలో ఉందన్నారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో 0.02 శాతంగా ఉందని.. అదే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. జగన్‌ పాలనలో యువత నిర్వీర్యం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com