ఏపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 7వ తేదీ వరకు లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో చేర్చనుంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా వైఎస్సార్ బీమా పథకం లబ్ధిదారులను నమోదు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీలోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలను గుర్తించి వైఎస్సార్ బీమా పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు.
గత నెల 29వ తేదీ నుంచి నమోదు ప్రక్రియ మొదలవ్వగా.. 7వ తేదీలోపు పూర్తి చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించి నమోదు చేయనున్నారు. లబ్ధిదారులను చేర్చిన తర్వాత జులై 1 నాటి నుంచి వారికి పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందిస్తారు. అలాగే 18- 70 సంవత్సరాలోపు వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత వైలక్యం పొందినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తారు.
ఈ పథకాన్ని నేరుగా గ్రామ, వార్డు సచివాలయ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. బ్యాంకులు, ఇతర ఏ బీమా సంస్థలకు సంబంధం లేదు. నేరుగా ప్రభుత్వమే సచివాలయాల ద్వారా పరిహారం ఇస్తుంది. ఈ పథకం అమలకు బడ్జెట్లో రూ.372 కోట్లు కూడా ప్రభుత్వం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులై 1,2021న ఈ పథకాన్ని జగన్ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఆర్ధిక సంవత్సరంలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాల్లో రూ.1307 కోట్లు ఖర్చు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బీమా పేరుతో అమలు చేస్తోంది. ఈ పథకానికి ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి నమోదు ప్రక్రియను చేపట్టి లబ్ధిదారులను గుర్తిస్తారు.