తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం ముందు ఎన్నో ఏళ్లుగా నిటారుగా నిలబడి ఎంతో మంది భక్తులకు చల్లని నీడనిచ్చిన వృక్షం (రావి చెట్టు) ఒక్కసారిగా మృత్యుపాశమైంది. గురువారం (జూన్ 1) సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు విరిగిపోయి కూలడంతో పలువురు భక్తులు దానికింద చిక్కుకొని గాయపడగా.. వారిలో ఒకరు మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది చెట్టు కొమ్మలను పక్కకు తొలగించి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో చెట్టు సమీపంలో భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు కూలితే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు.
ఈ రావి చెట్టు వందల ఏళ్ల నాటిదని భక్తులు చెబుతున్నారు. యంత్రాల సాయంతో చెట్టు కొమ్మలను కోసి, అక్కడ నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ వృక్షం కూలిన ఘటనలో ఇంకేదైనా నష్టం జరిగిందా తెలియాల్సి ఉంది. గురువారం ఉదయం నుంచి తిరుపతిలో ఎండ ఎక్కువగా ఉంది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద ఎత్తున గాలులు వీచాయి. దీంతో ఆలయం బయట ఉన్న ఈ భారీ చెట్టు కూలిపోయింది. వందల ఏళ్లుగా ఎన్నో గాలి వానలను తట్టుకొని నిలిచిన చెట్టు.. ఒక్కసారిగా కూలిపోవడం ఆలయ సిబ్బందిని ఆశ్చర్యపరిచింది.