ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరసర ఫరాల శాఖ గోధుమ పిండి..ప్రారంభించిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 06:53 PM

రేషన్ షాపుల్లో పౌరసర ఫరాల శాఖ గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించారు. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధరను రూ.16 గా నిర్ణయించారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోంది.. ఇప్పుడు గోధుమ పిండి కూడా చేరింది.


ఒక్కో కార్డుపై రెండు కిలోల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. దేశ వ్యాప్తంగా ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు భేష్ అని ప్రశంసలు వచ్చాయి. పేద వర్గాలకు మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి కిలో రూ.40గా ఉంది. రాష్ట్రం లోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని.. ఒక్క విశాఖలోనే 4,54,485 కార్డుదారులకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. లబ్దిదారులు ఈ అవకాశం వినియోగించు కోవాలని కోరారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీ పై గోధుమపిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు .


అంతేకాదు ఏపీలో పేదలకు చిరుధాన్యాలను అందించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ జొన్నలు, రాగుల పంపిణీ మళ్లీ ప్రారంభించాలి నిర్ణయించింది. UNO 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో పాటూ కేంద్రం కూడా చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తోంది. అందుకే జొన్నలు, రాగులు రేషన్‌ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. అందుకే కొన్ని వివరాలు సేకరిస్తోంది. రేషన్‌ కార్డుదారుల్లో ఎంతమంది వీటిని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని ఆరా తీస్తోంది.


ఒక్కో రేషన్‌ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలనుకుంటోంది. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా అంగీకరిస్తారా లేదా అని పత్రాలపై సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఈ సర్వే పూర్తికాగానే పంపిణీపై కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వం గోధుమ పిండి పంపిణీని ప్రారంభించగా.. చిరు ధాన్యాలను కూడా పంపిణీ చేయనుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com