ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం విషయంలో మళ్లీ నిరాశే మిగిలింది,,అరకొరగా ఏపీని ఆదుకొన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 06:51 PM

ప్రతిసారి ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిరాశే మిగులుతోంది. కేంద్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు సంస్థలకూ బడ్జెట్‌లో కొన్ని కేటాయింపులు చేశారు. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఇచ్చారు. అలాగే మరికొన్ని కేటాయింపులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడంతో నిరాశ ఎదురైంది.


కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు.. పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ - రూ. 683 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపుల విషయానికి వస్తే.. రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు ఇచ్చారు. మంగళగిరి, బీబీనగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు కేటాయించారు. సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు ఇచ్చారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. సింగరేణి - రూ.1,650 కోట్లు.. ఐఐటీ హైదరాబాద్‌ - 300 కోట్లు.. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు కేటాయించారు.


ఏపీ విభజన హామీల పరంగా బడ్జెట్‌లో నిరాశే మిగిలిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అన్నారు. విభజన హామీలకు సంబంధించి నిధుల అంశంపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని.. పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, రైల్వే కారిడార్‌, స్టీల్‌ ఫ్యాక్టరీకి సాయం వంటి ఏ అంశాన్నీ బడ్జెట్‌లో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశాలను పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు.


వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదన్నారు ఎంపీలు. రైల్వే కారిడార్, స్టీల్‌ ప్లాంట్‌కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదని.. వీటిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినా పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరం అన్నారు. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉందన్నారు ఎంపీలు.


కేంద్ర బడ్జెట్ వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం సహా పలు ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని.. 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉంది అన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారని అభిప్రాయపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com