నకిలీ నోట్ల కేసులో అరెస్టు అయిన రాజపుత్ర రజనిపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకొంది. దొంగ నోట్ల చెలామణి కేసులో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన.. ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవినుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్గా పని చేసిన రాజపుత్ర రజనిని.. నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రజనితో పాటూ చరణ్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర పోలీసులు రూ.44 లక్షల విలువ గల రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్సీపీ మహిళా నేత దొంగనోట్ల కేసులో పోలీసులకు చిక్కడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రజని ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇటు రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా పదవి కూడా ఉంది. ఆమె పదవీకాలం ఇటీవల ముగియగా.. మరోసారి పదవిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజనిపై 2017లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా డైరెక్టర్ పదవినుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.