ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరుముద్దలో రాగి మాల్డ్ పంపిణీ...మార్చి ఒకటి నుంచి అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:49 PM

మార్చి 1 నుంచి గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా.. పిల్లలకు రాగి మాల్ట్‌ పంపిణీ చేయాలి అధికార్లకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సూచించారు.  మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రులను సందర్శించాలని సూచించారు. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాల‌ని జగన్ స్పష్టం చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో.. వైద్యారోగ్య శాఖపై స‌మీక్షించిన జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు.


'మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని.. వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది' అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.


'మార్చి 1 నుంచి గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా.. పిల్లలకు రాగి మాల్ట్‌ పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలి' అని సీఎం సూచించారు.


'విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది సంబంధిత సమస్యలను నివేదించగానే.. వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌ వీటిపై పర్యవేక్షణ చేయాలి. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతిరోజూ దీనిపై సమీక్ష చేయాలి. జిల్లాల్లోని కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ చేయాలి. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలి' అని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.


'చిన్నారులు, స్కూలు పిల్లల్లో దంత శుభ్రతపై అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్‌ నిర్వహించి వారికి చికిత్స అందించే కార్యక్రమంపై తగిన ఆలోచన చేయాలి' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో సీఎం ఇచ్చినా ఆదేశాలతో.. ఆరోగ్య శ్రీ సేవలపై అధికారులు యాప్‌ను రూపొందించారు. యాప్‌లో మరికొన్ని మార్పులు చేర్పులపై సీఎం సూచనలు చేయగా.. త్వరలోనే యాప్‌ ప్రారంభానికి సన్నాహాలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా యాప్‌ ఉండాలని జగన్ ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com