ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 09:41 PM

ఏపీలో టీడీపీకి దిక్కులేదని.. రేపో, పో ఆ పార్టీని మూసివేస్తారని మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజురోజుకీ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు.. చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు.


చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఇద్దరూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబుది పూర్తిగా విష ప్రచారమని ప్రజలు తిట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. నారా లోకేష్‌ రాజకీయ అజ్ఞాని అని.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన వ్యక్తి లోకేష్‌ అని ధ్వజమెత్తారు.


చంద్రబాబు సినిమా స్టైల్‌లో జనం ముందు నాటకాలు వేస్తున్నారని జోగి రమేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను కాటేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా తానేం చేశానో చెప్పుకుని ఓట్లడగటం సహజమని.. కానీ అలాంటిదేమీ లేకుండా చంద్రబాబు జనాన్ని కాటు వేస్తున్నారని విమర్శించారు. 86 నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని వారి సొంత సర్వేలోనే తేలిందన్నారు. గతంలో ఏవైనా మంచి పనులు చేస్తేనే జనం గుర్తు పెట్టుకుంటారని.. అవేవీ చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో 23 సీట్లకు దించేశారని ఎద్దేవా చేశారు.


ఇక పవన్ కళ్యాణ్ ‘ప్యాకేజీ’ కోసం ఎన్ని డ్రామాలైనా చేస్తాడని మంత్రి జోగి రమేష్ కౌంటర్ వేశారు. బీసీల్లో 82 వేల మందిని సీఎం జగన్మోహన్ రెడ్డి లీడర్లుగా తయారు చేశారని.. రాష్ట్రమంతా జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం మార్మోగుతోందని పేర్కొన్నారు. లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అని.. అందుకే ఇష్టానుసారం ట్వీట్లు పెడుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు, భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే, దానిపై కూడా విమర్శలు చేయటం ఒక్క లోకేష్‌కే చెల్లిందన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చికుక్కల్లాగా జనాన్ని కాటేస్తున్నారని.. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని తేల్చి చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com