ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీప ప్రాంత వాసులు దుబాయ్ వెళ్లాలంటే ఇతర విమానాశ్రయాల ద్వారా వెళ్లాల్సివచ్చేంది. కానీ ఇపుడు విజయవాడ చుట్టుపక్కల వాసులకు సంతోషాన్నిచ్చే ఓ వార్త అందింది. దుబాయి వెళ్లేందుకు వారు మరీ దూరంలో ఉన్న హైదరాబాద్, చెన్నై, విశాఖ విమానాశ్రయాలకు వెళ్లనక్కర్లేదు. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటే చాలు. ఈ నెల 29 నుంచి దుబాయికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును విజయవాడ విమానాశ్రయం నుంచి నడపనున్నట్టు ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ శనివారం నాటి భేటీలో అధికారి ఒకరు వెల్లడించారు. వారంలో రెండు విమాన సర్వీసులు విజయవాడ నుంచి అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు.