ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ఆర్థిక భద్రతే జగనన్న ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:06 PM

మహిళల ఆర్థిక భద్రతే జగన్నన్న ధ్యేయమని స్థానిక శాసన సభ్యులు అలజంగి జోగారావు అన్నారు. సోమవారం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన జగన్నన్న చేయూత 3వ విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్ల మంది మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం చేయూత పధకాన్ని ముఖ్యమంత్రి జగన్ పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 26 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సుమారు రూ. 14, 141 కోట్లను రుణమాఫీ చేసిందని అన్నారు. చేయూత ముఖ్య ఉద్దేశ్యం ప్రతీ మహిళా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తద్వారా కుటుంబానికి, సమాజానికి మేలు జరుగుతుంది వివరించారు. 


పిల్లల భవిష్యత్ కోసం, ఇంటి ఆర్థిక అవసరాల కోసం, స్కూల్ ఫీజ్ ల కోసం, వసతి కోసం జగన్నన్న చేయూత ద్వారా వచ్చిన సొమ్మను ప్రతీ మహిళా ఉపయోగిస్తున్నారని వివరించారు. ప్రతీ పథకానికి మహిళ పేరు పెట్టడం జరిగిందని అన్నారు. పిల్లలు చదువుకు దూరం కాకూడదని అమ్మఒడి పధకం ద్వారా ప్రతి అమ్మకు వారి ఖాతాలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను జగన్నన్న వేస్తున్నారని తెలిపారు. జగనన్న పాదయాత్ర లో ప్రకటించిన నవరత్నాలు, సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని అన్నారు. మహిళలకు వారి కుటుంబాలలో గౌరవం పెరగాలని , ప్రతీ మహిళా తన కాళ్లపై తాను నిలబడేలా జగన్నన్న కృషి చేస్తున్నారని అన్నారు. వారి అభ్యున్నతిని ముఖ్యమంత్రి తన భుజాన వేసుకుని వారి కోసం సున్నా వడ్డీ ఇవ్వడం జరిగిందని అన్నారు. 


మహిళల కోసం వారి ఆర్థిక అవసరాలకు తీసుకున్న ఋణ భారాన్ని తగ్గించడం కోసం రుణమాఫీ చేసి మహిళల పట్ల ముఖ్యమంత్రి కి ఉన్న గౌరవాన్ని తెలుపుతున్నారని వివరించారు. జగన్నన్న చేయూత పధకం మహిళలకు గౌరవాన్ని పెంచిందని, చేయూత ద్వారా వచ్చిన డబ్బుతో మహిళలు చేపల పెంపకం, గొర్రెల పెంపకం, పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని వివరించారు. ప్రతీ అక్కా చెల్లెమ్మల అవసరాలను ముఖ్యమంత్రి తీరుస్తున్నారని అన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామని వివరించారు. 


తలదాచుకోవడానికి కనీసం నీడలేని నిరుపేదలకు జగన్నన్న గూడు కల్పించారని, రూరల్ మండలంలో సుమారు 3, 300, అర్బన్ లో 3, 000 ఇళ్లను ముఖ్యమంత్రి ఇచ్చారని అన్నారు. ఇసుక, సిమెంట్ లను పేదలకు ఉచితంగా అందించి ముఖ్యమంత్రి తన గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బి. గౌరీశ్వరి మాట్లాడుతూ చేయూత పధకం మహిళాభివృద్ది కోసం జగన్నన్న ప్రవేశపెట్టిన మంచి పథకమని అన్నారు. రాష్ట్రంలో ఎస్. సి, ఎస్. టి, బి. సి, మైనారిటీ, మహిళల భద్రతకు, ఆర్థిక వృద్ధికి, కుటుంబ పోషణకు ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కొండపల్లి రుక్మిణి, ఎంపిపి మజ్జి శోభా రాణి, జెడ్పీటీసీ బి. రేవతమ్మ, ఏయంసి చైర్ పర్సన్ మరడాన భాగ్య శ్రీ, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com