అమరావతి : రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కిడ్నీ బాధితులందరికీ నెలకు రూ. 2500లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలెక్టర్లను ఆదేశించారు. ఇక్కడ జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితులందరికీ బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్ తో పాటు ఇక పై ప్రత్యేక ఔషధాలూ సరఫరా చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఇప్పటి వరకూ ఒక లక్షా 88 వేల 559 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికిగాను ఈ పథకం కింద మొత్తం 2 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు.బియ్యాం సేకరణ, చౌకబియ్యం తరలింపులో అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు పౌర సరఫరాల శాఖపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసే బియ్యం విషయంలో ఎటువంటి అక్రమాలకూ తావు లేదని, అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.అక్రమాలకు పాల్పడేవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.