అమరావతి : ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లలో గృహ ప్రవేశాలు ఫిబ్రవరి మొదటివారంలో జరుగుతాయి. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గ్రామాల్లోని రెండున్నర లక్షల ఇళ్లలో ఫిబ్రవరి మొదటి వారంలో గృహ ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని 10 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద వచ్చే ఏడాది జనవరినాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని ఆయన అన్నారు. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హులైన వారందరికీ వారసత్వ హక్కులు కల్పించాలని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి ఎమ్మార్వోలు, ఆర్డీవోలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.