హసన్ : కర్నాటకలోని హసన్ తాలుకాలోని కరెకేరా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పదిమంది గాయాలపాలైనట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆరె.కె. శహపుర్వాద్ పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెఎస్ఆర్టిసికి చెందిన బస్సు కరెకెరా జాతీయ రహదారిలో గల బ్రిడ్జిపై నుండి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో బస్సు డైవర్, కండెక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హసన్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.