ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంపైర్ల తప్పిదం.. అనూహ్యంగా ఓడిన హైదరాబాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 11:09 AM

విశాఖపట్నం: సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో అంపైర్ల తప్పిదం కారణంగా హైదరాబాద్ జట్టు రెండు పరుగుల తేడాతో కర్ణాటక చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. వైజాగ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలింగ్ ప్రారంభించడానికి ముందు తమకు రెండు పరుగులు కలపాలని కెప్టెన్ వినయ్ కుమార్ అంపైర్లపై ఒత్తిడి చేశాడు. బౌలింగ్ చేయడానికి చాలాసేపు నిరాకరించాడు. దీంతో కర్ణాటక జట్టుకు రెండు పరుగులు కలుపుతున్నట్లు అంపైర్లు చెప్పారు.


వాస్తవానికి ఏం జరిగిందంటే.. కర్ణాటక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ కరుణ్ నాయర్ మిడ్ వికెట్ మీదుగా ఆడి రెండు పరుగులు తీశాడు. ఫీల్డర్ మెహదీ హసన్ బంతి బౌండరీ దాటకుండా ఆపాడు. కానీ ఆ క్రమంలో బౌండరీ రోప్‌ను తాకాడు. ఈ విషయం గమనించని అంపైర్ బౌండరీ ఇవ్వలేదు. తర్వాత రిప్లేలో మాత్రం అది బౌండరీ అని తేలింది. దీంతో మ్యాచ్ అనంతరం తమకు రెండు రన్స్ కలపాల్సిందేనని కర్ణాటక కెప్టెన్ పట్టుబట్టాడు.


 


దీంతో హైదరాబాద్ లక్ష్యాన్ని 204 నుంచి 206కు పెంచారు. కానీ మేం మాత్రం 204 పరుగుల లక్ష్యంతోనే ఆడతామని హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లకు తెలిపాడు. 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కోసం సన్నద్ధం కావడం కోసం మ్యాచ్ అనంతరం హైదరాబాద్ క్రికెటర్లు చాలా సేపు గ్రౌండ్లో ఉండిపోయారు. కానీ అంపైర్లు మాత్రం రెండు పరుగుల తేడాతో కర్ణాటక గెలుపొందినట్లు ప్రకటించారు.


ఈ గందరగోళానికి కారణమైన వారిపై మ్యాచ్ రిఫరీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్ క్రికెటర్లు సూపర్ ఓవర్ కోసం వార్మప్ చేస్తూ గ్రౌండ్లోనే ఉండిపోవడంతో తర్వాత ఆంధ్రా, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com