వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి నేడు సమావేశం కానుంది. ఇ-వే బిల్లు విధానాన్ని ముందే అమల్లోకి తీసుకురావడం, పన్నుల ఎగవేతను నిరోధించడం వంటి అంశాలపై మండలి చర్చించనుంది. జీఎస్టీ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించడం, పన్ను ఎగవేత నిరోధంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబరుతో పోలిస్తే రూ.12,000 కోట్లు తగ్గడంతో ఈ సమావేశాల్లో పన్నుల ఎగవేతపై చర్చ కీలకం కానుంది. ఇది మొత్తంగా 24వ జీఎస్టీ మండలి సమావేశం. నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సమావేశాల్లో ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. అయితే అక్టోబరు జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో.. ఈ నిర్ణయంపై సమీక్ష చేయనున్నారు. ఇన్వాయిస్ మ్యాచింగ్ సైతం నేడు సమావేశాల్లో చర్చకు రానుందని సమాచారం.