న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 14 రోజుల పాటు(జనవరి 5) సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్, వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యంగ హోదా, రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం వంటి ముఖ్య బిల్లులు సహా ఇతర బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభమైనప్పటికీ చర్చలు మాత్రం సోమవారం నుంచి జరిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఎలాంటి చర్చ లేకుండానే మొదటి రోజు సభను వాయిదా వేస్తారు. ఇక శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సభలో సోమవారం నుంచి చర్చ మొదలుకానుంది. అదే రోజు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో సమావేశాలపై ఫలితాల ప్రభావం పడనుంది. సమావేశాల నిర్వహణపై స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం అఖిల పక్ష భేటీని నిర్వహించారు.