ఓటర్లు, మీడియా సాక్షిగా ప్రధాని మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. పోలింగ్ జరుగుతుండగానే ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నిర్వహించిన ఈ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు, పరిశీలకులు ప్రధానిని తప్పు పట్టారు. వెల్లువెత్తుతున్న ఈ విమర్శలపై ప్రధాని మోడీ పెదవి విప్పలేదు. అహ్మదాబాద్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా పూసిన తన వేలుని చూపుతూ ఆయన100 మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. ఆ తరువాత ఓపెన్టాప్ జీపులో నిలబడి ఆయన రోడ్షోను కొనసాగించారు. ఓటర్లు గుంపులుగుంపులుగా ఉన్నంత దూరం ఈ ప్రదర్శన కొనసాగింది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం గతంలో ఎన్నడూ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ రోడ్డుషోపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే ఈ వ్యాఖ్యలను బిజెపి తిప్పికొట్టింది. ఓడిపోతున్నామనే బాధలోనే ఇసిపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి బిజెపి, కాంగ్రెస్ నేతలు పోటెత్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం ముందు నినాదాలు చేశారు