కన్యాకుమారి: ఓఖీ తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన తమిళ జాలర్ల కుటుంబాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఓఖీ తుఫాన్ వల్ల కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో మొత్తం 66 మంది మృతిచెందారు. జాలర్ల తరపున ఒక మంత్రిత్వశాఖ కూడా ఉంటే మంచిదని, దాని వల్ల వాళ్ల సమస్యలు తెలుస్తాయని, ఆ వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. కేరళలోని విజిహిన్జమ్లోనూ ఆయన పర్యటించారు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆయన కలుసుకున్నారు. ప్రతి రోజు మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఓఖీలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రతి ఒక కుటుంబానికి నష్టపరిహారం అందేలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై వత్తిడి తెస్తుందన్నారు. సహజ విపత్తు నుంచి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవాలని, మరింత పటిష్టమైన వాతావరణ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.