ఒంగోలు: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలకు సిద్ధమైనట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐ.వి. సుబ్బారావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మూడున్నర నెలల క్రితం నంద్యాల సభలో ముఖ్యమంత్రి జర్నలిస్టులకు మూడు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనవసర నిబంధనల జోలికి వెళ్లకుండా పనిచేసే ప్రతి జర్నలిస్టుకు తక్షణం అక్రిడిటేషన్ ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు, వారి పిల్లలకు విద్యా సంస్థల్లో 50శాతం ఫీజు రాయితీ అమలు డిమాండ్లతో ఈ ఆందోళనలు చేపడుతున్నారు.