ముంబయి: అంతర్జాతీయ సంకేతాలు, కొనుగోళ్ల అండతో క్రితం మూడు సెషన్లలో లాభాల జోరు కొనసాగించిన సూచీలు.. నేడు చతికిలపడ్డాయి.ఫెడ్ సమావేశం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీనికి తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్పై ప్రభావం చూపింది. ఆరంభం నుంచి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 10,300 కిందకు పడిపోయింది.
ఈ ఉదయం 67 పాయింట్ల నష్టంతో బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దిగ్గజ కంపెనీ షేర్లు కుదేలవడంతో ఒత్తిడికి గురైన సూచీ చివరకు 228 పాయింట్లు కోల్పోయి 33,228 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు నష్టపోయి 10,240 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 64.43గా కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, గెయిల్, లుపిన్ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్ పెట్రోలియం, భారతీ ఇన్ఫ్రాటెల్, భారత్ పెట్రోలియం, కోల్ఇండియా, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి.