అమరావతి : రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆజాద్ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో మొత్తం 18 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురం జిల్లాలోని ఊబిచర్ల, నూజివీడు, హైదరాబాద్ గడ్డి అన్నారంలోని అపార్ట్మెంట్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడ యనమలకుదురులోని చంద్రశేఖర్ సోదరుడు వివేకానంద నివాసంలో భారీగా ఆస్తులు గుర్తించినట్లు ఏలూరు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. వివేకానంద పేరిట రూ. 50 కోట్ల ఆస్తులు, చంద్రశేఖర్ పేరిట రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఊబిచర్లలో 32 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్, విజయవాడ గొల్లపూడిలో చంద్రశేఖర్కు అధునాతన భవనం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.