చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వానికి డీఎంకే అండగా నిలిచింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె మరణంపై న్యాయవిచారణ జరిపించాలన్న పన్నీర్ డిమాండ్ సరైనదేనని డీఎంకే పేర్కొంది. జయ మరణం విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్కు కూడా ఇటువంటి అనుమానాలే ఉన్నాయని, పన్నీర్ డిమాండ్ సరైనదేనని డీఎంకే అధికార ప్రతినిధి ఎ.శరవణన్ పేర్కొన్నారు. జయలలిత మరణం వెనక ఏదో మిస్టరీ ఉదని అన్నారు. కాబట్టి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. జయలలితను ఆస్పత్రిలో ఎందుకు చేర్చారు? ఆమెకు ఏమైంది? ఆస్పత్రిలో ఆమెకు ఎటువంటి వైద్యం అందించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందేనని అన్నారు. తప్పనిసరిగా దర్యాప్తు జరిగి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇవే విషయాలపై పన్నీర్ కూడా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.