పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తున్నామన్నారు. ప్రతి వారం అందించే వివరాలనే శ్వేతపత్రంగా భావించాలన్నారు. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మే నెలలోపు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టు పూర్తికి త్రిసభ్య కమిటీ చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామన్నారు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణమైతే గ్రావెటీ ద్వారా నీరందిస్తామన్నారు. ఏపీలో ప్రతీ రైతుకూ పోలవరం ఓ కల అని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రజల సెంటిమెంట్గా మారిందన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, పోలవరం పూర్తయితే కరవు పోతుందన్నారు.