అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేశారు. గుజరాత్లోని పాలన్పూర్లో మోదీ రెండో దశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అయ్యారని మోదీ ఆరోపించారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ప్రధాని డిమాండ్ చేశారు. ప్రధాని నీచమైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడంపై మోదీ నిప్పులు చెరిగిన విషయం విదితమే. పాక్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే అయ్యర్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారని మోదీ పేర్కొన్నారు. మణి శంకర్ అయ్యర్ నివాసంలో పాక్ హై కమిషనర్, పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైనట్లు శనివారం మీడియాలో కథనాలు వచ్చాయని ప్రధాని తెలిపారు. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగిందని మోదీ చెప్పారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. దీనిపై భారత ప్రజలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని మోదీ డిమాండ్ చేశారు.