నేపాల్ పార్లమెంటరీ, స్థానిక ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా కమ్యూనిస్టు పార్టీలు దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ సిపిఎన్-యుఎంఎల్, మావోయిస్టు సెంటర్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. గురువారం జరిగిన మలిదశ పోలింగ్లో 67 శాతం మేర ఓటింగ్ నమోదయింది. గత నెల 26న జరిగిన తొలిదశ పోలింగ్లో 65 శాతం ఓటింగ్ నమోదయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి మలి దశ పోలింగ్ పోలింగ్ ముగిసిన అనంతరం నిర్వహించిన అఖిలపక్ష భేటీ తరువాత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మలిదశ పోలింగ్లో చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ అయోధ్య ప్రసాది యాదవ్ చెప్పారు. రాజధాని కాఠ్మండూకు 14 కి.మీ దూరంలలో వున్న భక్తపూర్ జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రంలో అధికార నేపాలీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం సిపిఎన్(యుఎంఎల్) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. మొత్తం 7,752 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మలి దశ పోలింగ్లో 1.55 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించగా 2 లక్షల మందికి పైగా పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం 128 పార్లమెంటరీ స్థానాలకు, 45 జిల్లాల్లోని 256 ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి.