న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మ్యాక్స్ హాస్పటల్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రాణాలతో ఉన్న ఓ శిశువును మరణించినట్లుగా దృవీకరించిన కేసులో ఆ హాస్పటల్ లైసెన్సును రద్దు చేశారు. షాలిమార్ భాగ్లోని మ్యాక్స్ హాస్పటల్ ఇక నుంచి కొత్త పేషెంట్లను తీసుకోకూడదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. శిశువు మరణం కేసులో హాస్పటల్ నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఓ కవలల కేసులో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత నెలలో పుట్టిన కవలలు మరణించినట్లు మ్యాక్స్ హాస్పటల్ దృవీకరించింది. ఆ బేబీలను ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి పేరెంట్స్కు ఇచ్చింది. అయితే శ్మశానవాటికి వెళ్లి బ్యాగ్ తెరిచిన వాళ్లు షాక్ తిన్నారు. ఆ చిన్నారుల్లో ఒకరు శ్వాసతో ఉన్నట్లు పేరెంట్స్ గుర్తించారు. ఆ శిశువు వారం రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఇటీవల మృతిచెందాడు. ఈ కేసును సిరీయస్గా తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో హాస్పటల్లో విచారణ చేపట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రహించి ఆ హాస్పటల్పై చర్యకు దిగింది. చిన్నారులకు ఈసీజీ తీయడంలో హాస్పటల్ విఫలమైనట్లు త్రిసభ్య ప్యానెల్ గుర్తించింది. ఈసీజీ ద్వారానే గుండె చప్పుడు తెలుస్తుంది. కానీ హాస్పటల్ ఈసీజీ చేయకపోవడం వల్ల చిన్నారులు మరణించినట్లు తేల్చేసింది. దీంతో అన్యాయంగా శిశువులు బలయ్యారు. అయితే హాస్పటల్ వైఖరిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆ కేసును డీల్ చేసిన ఇద్దరు డాక్టర్లను ఇటీవలే సస్పెండ్ చేశారు.