దుబాయ్: భారత్-శ్రీలంక మధ్య దిల్లీలో జరిగిన టెస్టు ఐసీసీ దృష్టికి వెళ్లింది. ఫిబ్రవరిలో నిర్వహించబోయే సమావేశంలో ఈ టెస్టు గురించి ప్రధానంగా చర్చకు రానుంది. ఇంతకీ ఎందుకో తెలుసా!. వాయు కాలుష్యం కారణంగా లంక ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడటంతో యావత్ ప్రపంచ దృష్టి ఈ టెస్టుపైకి మళ్లింది.
గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో లంక ఆటగాళ్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాము ఆడలేమని చెప్పినా, నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిపివేయడం కుదరదని అంపైర్లు తేల్చిచెప్పారు. దీంతో లంక ఆటగాళ్లు మాస్కులు ధరించి ఫీల్డింగ్ చేశారు. బౌలింగ్ వేసే సమయంలో ఇబ్బందికి గురైన లక్మల్, షమి మైదానంలోనే వాంతి చేసుకున్నారు. ఇబ్బందికర పరిస్థితుల మధ్య మ్యాచ్ను కొనసాగించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై లంక క్రికెట్ బోర్డు అధికారులు ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
దిల్లీ టెస్టులో వాయు కాలుష్యం వల్ల ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, వాయుకాలుష్య తీవ్రత ఎంత, ఐసీసీ ఆమోదించిన సిరీసుల్లో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి తదితర అంశాలపై ఐసీసీ ప్రతినిధులు ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. దిల్లీ టెస్టుపై నివేదిక తయారు చేయాల్సిందిగా ఐసీసీ వైద్య నిపుణులను కోరింది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వివరించాలని తెలిపింది.