అమరావతి : పోలవరంపై అసెంబ్లీలో చేసిన ప్రకటనే అన్ని ప్రశ్నలకూ సమాధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం అంశంపై ఆయనీ రోజు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, అయిన వ్యయం తదితర అన్ని అంశాలనూ అసెంబ్లీలో వివరించినట్లు ఆయన చెప్పారు. పోలవరం విషయంలో ప్రతి పైసాకూ లెక్కలు చెబుతున్నాం, పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. గడువులోగా పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టంగా చెప్పారనీ చంద్రబాబు వివరించారు. అధికారుల లేఖవల్లనే కొంత గందరగోళం ఏర్పడిందని, కేంద్రం తక్షణమే స్పందించి సమస్యను సరిదిద్దిందని చంద్రబాబు అన్నారు. ఈ వివరాలన్నీ మంత్రులు, పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.