ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత భారీమొత్తంలో నల్లధనం తెల్లధనంగా మారిపోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. లక్షలాది ఉద్యోగాలు పోయాయని, కొత్త ఉద్యోగాల కల్పన జరుగలేదని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు వంటి తప్పిదాలను భవిష్యత్తులో చేయకూడదని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన అస్థిరమైన విదేశీ విధానాల వల్ల జాతి భద్రతకు ముప్పు కలిగిందని ఆయన అన్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నది అంశాన్ని మోడీ తనతో చర్చించారని అన్నారని అయితే తనకు గుర్తు లేదని మన్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రులందరినీ కలవాల్సిన బాధ్యత అప్పట్లో ప్రధాని హోదాలో ఉన్న తనపై ఉందని ఆయన చెప్పారు.