వివిధ ప్రభుత్వ సేవలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యాలపై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐదుగురు సభ్యులతో కూడి రాజ్యాంగ ధర్మాసనం వచ్చేవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ఆధార్ను అనుసంధానం చేసుకునేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ఆధార్ అనుసంధానంపై ప్రస్తుతం ఉన్న డిసెంబర్ 31 గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే మొబైల్ నంబర్లకు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకే చివరి తేదీ అని.. ఆ గడువును పొడగించట్లేదని అటార్నీ జనరల్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని వేణుగోపాల్ స్పష్టం చేశారు.