పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన పవన్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రూ.125 కోట్లతో ప్రారంభమైందన్నారు. పోలవరం విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు సర్వసాధారణమన్నారు. పోలవరం ఏ ఒక్క పార్టీదో... ఏ ఒక్క ప్రభుత్వానిదో కాదు. పోలవరం చాలా కష్టమైన... ఛాలెంజింగ్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించాలి. ఉన్న ప్రాజెక్టు ఆపేస్తే చాలా నష్టం కేంద్రానికి లెక్కలు చూపిస్తే స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదు... రాష్ట్ర ప్రభుత్వం నిజాలు దాస్తున్న కొద్ది నాకు కూడా సందేహాలు కలుగుతున్నాయి. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరు. పోలవరంపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి అప్పటికి కూడా కేంద్రం స్పందించకపోతే మీతో కలిసి నేను కూడా పోరాటం చేస్తా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.