రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జిల్లా సెలక్షన్ కమిటీ (డిఎస్సీ) 2018 నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పోస్టింగ్లిచ్చేలా షెడ్యూల్ను రూపొందించింది. సచివాలయం పబ్లిసిటీ సెల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సీ వివరాల్ని వెల్లడించారు. డిఎస్సీ 2018 ద్వారా 12,370 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 10,313, మోడల్ పాఠశాలల్లో 1197 పోస్టులు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సంబంధించి 860 పోస్టులు ఉన్నాయన్నారు. 10,313 పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందన్నారు. మిగిలిన పోస్టులకు క్లియరెన్స్ రావాల్సిఉందన్నారు. డిఎస్సీ రాతపరీక్ష మాత్రం 12,370 పోస్టులకు జరుగుతుంద న్నారు. 2018 జూన్ 12 నాటికి ఉపాధ్యాయు లకు పోస్టింగ్లివ్వాలని నిర్ణయించామన్నారు. దీనికోసం డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. డిఎస్సీకి సంబంధిచి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 23,24, 26 తేదీల్లో అభ్యర్థులకు రాత పరీక్ష జరుగుతుందన్నారు. హాల్ టిక్కెట్లను వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.