ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్‌ అనుసంధానంతో బినామీల ఆటకట్టు : ప్రధాని మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 02:32 PM

న్యూఢిల్లీ: తన నిర్ణయాల వల్ల తనకు ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చినా దాన్ని స్వీకరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయంగా తన భవిష్యత్తును త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అత్యుత్తమ భారత్ కోసం తన లక్ష్యాలను వదిలే ప్రసక్తే లేదని మోదీ అన్నారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. నోట్ల రద్దుకు ముందు నల్ల ధనం ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని, కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత సేకరించిన డేటా ఆధారంగా అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటకు వస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఆధార్ వ్యవస్థను కూడా మోదీ మెచ్చుకున్నారు. మొబైల్, జన్‌ధన్ అకౌంట్లకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఆధార్‌తో బినామీ వ్యవస్థను కూకటివేళ్లతో పెకులించవచ్చు అని మోదీ అన్నారు. నోట్ల రద్దు తరువాత భారతీయల వైఖరిలో చాలా మార్పు వచ్చిందని, ఆ ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన, శుద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నల్లధనం కలిగిన వ్యక్తులు భయపడుతున్నారని మోదీ అన్నారు. ఆధార్‌తో సామాన్య ప్రజల హక్కులను కాపాడవచ్చు అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com