అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో వడ్డీ వ్యాపారులు చేస్తున్న అక్రమ దందాపై మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో చాలావరకు పట్టణ స్థాయి నుండి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దీనిపై చట్టం లేకపోవడంతో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళలను వడ్డీల పేరుతో వేధించిన సందర్భాలున్నాయన్నారు. అందుకే దీనిపై చట్టం తీసుకువస్తే ఈ అరాచకాలను అరికట్టవచ్చన్నారు. ఈ చట్టంలో ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేయాలంటే లైసెన్స్ పొందాల్సిందేనన్నారు. వారి వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వానికి రూ.5వేల నుండి రూ.2లక్షల వరకు డిపాజిట్ చేయాల్సిన నిబంధనను కూడా చట్టంలో పొందుపరిచామన్నారు. వ్యాపారం చేసే వ్యక్తులు వాటి వివరాలను బోర్డులో స్పష్టంగా పెట్టాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వమే వడ్డీ నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడే ప్రజలను కాపాడుకోవచ్చన్నారు.