విమానంలో ఫైర్ అలారం మోగడంతో 170 మంది ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు బుధవారం ఉదయం 5:30 నిమిషాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఈ719 విమానం 170 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకుంది. విమానం బయల్దేరిన పది నిమిషాలకు ప్రయాణికులంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో స్మోక్ అలారం మోగింది. దీంతో ఏటీసీని సంప్రదించిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. అనంతరం తనిఖీలు నిర్వహించారు. అయితే పొరపాటున అలారం మోగిందని, దీనివల్లే గందరగోళం నెలకొందని ఇండిగో వర్గాలు తెలిపాయి. తనిఖీలలో ఆయిల్ లీకేజీ కానీ, వైర్లు కాలినట్లు కానీ కనిపించలేదని నిర్ధారించాయి. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే తాము ఈ చర్యలు తీసుకున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది.