న్యూఢిల్లీ: సైబర్స్పేస్ అంశంపై అయిదవ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పెన్షనర్లు బ్యాంక్ ముందు నిలబడాల్సిన అవసరం లేదని, ఆధార్తో తమ జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్న ఘటనలు పెరిగినట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీ వల్లే క్యాష్లెస్ లావాదేవీలు పెరిగాయన్నారు. భీమ్ యాప్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. మొబైల్ పవర్ ద్వారా పౌరులు సాధికారత సాధిస్తున్నారని మోదీ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల వ్యవసాయ లాభాలు కూడా పెరిగినట్లు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఈ-మార్కెట్లో ఓ చిన్న వ్యాపారి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అని, తన ఉత్పత్తులను ప్రభుత్వానికి అమ్ముకునే వీలుందన్నారు. జన్ భాగీదారీ పెంచేందుకు డిజిటల్ డొమేయిన్ను వాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా అనేక సేవలు అందించనున్నారని మోదీ తెలిపారు. అందరు కలిసి ప్రగతి సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. సైబర్స్పేస్లో పెట్టుబడులు పెట్టి ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు సైబర్స్పేస్కు సహకరిస్తున్నాయన్నారు. ఇంటర్నెట్ ఒక ఐడియల్ ఫ్లాట్ఫామ్గా మారిందన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా యువత తమ టాలెంట్ను ప్రదర్శిస్తున్నారన్నారు. సైబర్భద్రతపై పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సాధారణ పౌరుడికి కూడా సైబర్భద్రత ఉండాలన్నారు. స్టార్టప్ల ద్వారా రోజు వారీ సమస్యలకు సమాధానాలు దొరుకుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ మొబైల్ యాప్ ద్వారా తనకు అనేక కీలక సలహాలు, సూచనలు అందుతున్నాయన్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉగ్రవాదులకు ప్లేగ్రౌండ్ కాకుండా చూసుకోవాలన్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే సైబర్ టెక్నాలజీని రూపొందించాలన్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద ఇండియా బుక్ను ఆవిష్కరించారు. సైబర్ స్పేస్పై 4 థీమ్లతో ఈ బుక్ను రూపొందించారు.