హిమాలయాల్లో భారీ భూకంపం సంభవించనుందని భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్ వినీత్ గెహ్లాట్ తెలిపారు. ధర్మశాలలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ హిమాలయాల కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గత 700 ఏళ్లలో ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించిన దాఖలాలు లేవన్న ఆయన, అతి త్వరలోనే ఈ భారీ భూకంపం ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేయనుందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్ లో లభించిన వివరాల ప్రకారం చేసిన అధ్యయనంలో ఇది తేలిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే భవనాలను సరైన ప్రణాళికతో నిర్మించాలని ఆయన హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తీవ్రత తగ్గించే అవకాశం ఉందని ఆయన సూచించారు.