న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఇవాళ తెల్లవారుజామను భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అనంతనాగ్ పట్టణంలోని రేషి బజార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో పలు నివాస భవనాలు, షాపులు ధ్వంసమైనట్టు పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 3.30 సమయంలో ఎగసిన మంటలు చూస్తుండగానే సమీపంలోని ఇళ్లు, షాపుల్లోకి దావానలంలా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 12 భవనాలు ధ్వంసమైనట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘అగ్నిప్రమాదం వల్ల భారీ నష్టమే జరిగింది. అయితే ఎంతమేర అనేది స్పష్టంగా తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నాం...’’ అని ఆయన పేర్కొన్నారు.