నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అప్పులన్నీ తన కొడుకు జగన్ ఎదుగుదలకే ఖర్చు చేశారు తప్పా రాష్ట్రాభివృద్ధికి కాదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మద్యంపై నిషేధిస్తామనే హామీతో నాడు అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి, ఆ మద్యాన్నే ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చేశారని అన్నారు. ఇక, జగన్ ప్రజా సంకల్ప యాత్ర గురించి ఆయన ప్రస్తావిస్తూ, అది అబద్ధాల యాత్ర అని, అవినీతి ద్వారా అక్రమాస్తులు పోగేసుకున్న జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. రైతులకు ఇరవై ఏడు వేల కోట్లు రుణమాఫీ చేయడం ద్వారా దేశంలోనే రికార్డు సృష్టించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. నాడు వైఎస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నేడు చంద్రబాబు హయాంలో రైతులకు భరోసా కల్పించారని చెప్పారు.