నంది అవార్డ్స్ వివాదంపై సినీ రంగం నుంచి హాటు, ఘాటు స్పందనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ అవార్డ్స్ విషయంలో పలువురు సినీ ప్రముఖులు తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్స్ అన్నీ ఒక కులస్తులకే దక్కాయని కొందరు, తెలుగుదేశం పార్టీ అవార్డ్స్ లా ఉన్నాయివి అని మరికొందరు.. ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో నంది అవార్డ్స్ కమిటీ సభ్యులు కొందరు ఎదురుదాడికి దిగుతున్నారు. నీఛమైన పదజాలంతో వీరు స్పందించడం గమనార్హం. తాము అవార్డులను ప్రకటించిన తీరును వీరు దారుణమైన బాషలో సమర్థించుకోవడం.. అవార్డుల కమిటీలోని వారే ఇలా మాట్లాడటం.. అవార్డుల స్థాయిని మరింత దిగజార్చింది.
ఇదిలా ఉంటే ఈ అవార్డ్స్ ప్రకటన తీరుపై మండి పడ్డారు మరో నిర్మాత. ఈ సారి వంతు చంటి అడ్డాలది. ఇది వరకూ ప్రముఖ హీరోలతో సినిమాలు తీసిన నేపథ్యం ఉంది ఈ నిర్మాతకు. మనం, రుద్రమదేవి, రేసుగుర్రం.. వంటి సినిమాలకు సరైన స్థాయిలో అవార్డులు దక్కకపోవడాన్ని చంటి ఆక్షేపించారు. వాటికి అవార్డులు తీసుకునే అర్హత లేదా? అని ఈయన ప్రశ్నించారు.
సెలక్షన్ కమిటీ పక్షపాతంతో వ్యవహరించి, ఇష్టమైన వారికి అవార్డులు ఇచ్చేస్తే మిగతా వాళ్లు సినిమాలు తీయడం ఎందుకు? అని ఈ నిర్మాత ప్రశ్నించారు. అవార్డులు తీసుకోవాలంటే.. జ్యూరీలో లాబీయింగ్ అయినా ఉండాలి, ప్రభుత్వంతో సత్సంబంధాలు అయినా ఉండాలి, రెకమెండేషన్ అయినా ఉండాలి.. అనిపిస్తోందని చంటి అడ్డాల వ్యాఖ్యానించారు.