ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకోండి ; యూపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2017, 11:14 AM

లఖ్‌నవూ: ‘పద్మావతి’ చిత్రం విడుదలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ చిత్రానికి సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని కూడా సెన్సార్‌ బోర్డుకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఈ చిత్ర విడుదలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనం, నినాదాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని యూపీ హోంశాఖ అధికారి అరవింద్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రదర్శించొద్దంటూ సినిమా థియేటర్‌ యజమానులకు బెదిరింపు లేఖలు వస్తున్నట్లు ఆయన కేంద్ర ఐ అండ్‌ బీ శాఖకు తెలిపారు. మరోవైపు నవంబర్‌ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంపై రాజ్‌పుత్‌ వర్గీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అల్లావుద్దీన్‌ ఖిల్జీ, రాణి పద్మావతి మధ్య అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సహించేది లేదని, సినిమా విడుదలకు ముందే తమకు చూపించాల్సిందిగా రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com