ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన భారత నెట్ సదస్సులో ఐటీశాఖ మంత్రి లోకేష్ ఏపీ ఫైబర్ నెట్ పేరుతో మొత్తం రాష్ట్రాన్ని బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ విస్తరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 1.45 కోట్ల ఇల్లు, 12918 పంచాయితీలు, 60 వేలకుపైగా పాఠశాలలు, 670 మండల కార్యాలయాలు, 96 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, ఆరు వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో 3 లక్షల 75వేల విద్యుత్ స్థంభాలు వినియోగించుకొనున్నట్లు తెలిపారు. తొలి దశలో విద్యుత్ స్థంభాలు వినియోగించుకుని 23వేల 800 కిలోమీటర్ల కేబుల్ నెట్వర్క్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. రెండో దశలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్ నెట్ కింద 59వేల 563 కిలో మీటర్ల భూగర్భ కేబుల్ నెట్ వర్క్ 28 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. టెల్కోటవర్ల ద్వారా అన్ని ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, డేటా సెంటర్లు, బ్రాడ్ కాస్ట్ కేంద్రాలను కూడా ఈ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురావలని నిర్ణయించినట్లు చెప్పారు.