సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖలో 50 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మరో 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్ధీకరించాల్సి ఉందని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. ఏడాదికి మూడు సార్లు గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని సభకు వివరించారు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని, 19 లక్షల ఇళ్లు నిర్మించి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.
రూ.56వేల కోట్లు ఖర్చుపెట్టి పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, హుద్హుద్ బాధితుల కోసం 9,170 ఇళ్లు పూర్తిచేస్తున్నామని వివరించారు.హుద్హుద్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10వేలు చొప్పున విడుదల చేస్తున్నామని తెలిపారు.