శాన్ఫ్రాన్సిస్కో: ట్వీట్ చేసేందుకు ఉన్న 140 అక్షరాల పరిమితిని ట్విటర్ సంస్థ రెట్టింపు చేసింది. 280 అక్షరాలతో ట్వీట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బుధవారం తెల్లవారుజామున ట్విట్టర్ ప్రకటించింది. గత సెప్టెంబర్లో ఇది వరకే ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ తాజాగా అన్ని భాషల్లో అక్షరాలను 280 పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో ఇకపై ట్విటర్ ఖాతాదారులు తమ అభిప్రాయాలను మరింత సులభంగా, వివరంగా తెలియజేసే వీలు ఏర్పడింది.
అయితే ఈ అక్షరాల పరిమితి పెంపు జపనీస్, కొరియన్, చైనీస్లో తప్ప మిగతా అన్ని భాషలకు వర్తిస్తుంది. ఈ పరిమితిని పరిశీలన దశలో ఉన్నప్పుడే నెటిజన్లు 280 అక్షరాలను ఉపయోగించి చాలా ట్వీట్లు చేశారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నప్పుడు 280 అక్షరాలను ఉపయోగించి ట్వీట్ చేశారు.
ట్విటర్ స్థాపించిన 11ఏళ్లలో అక్షరాల పరిమితిని పెంచడం ఇదే తొలిసారికావడం విశేషం.